Grandma stories presents you telugu stories
నిజమైన దానశీలి
ఉజ్జయిని నగరంలో ఒక శివాలయం ఉంది. అక్కడ నిత్య పూజలు, హోమాలు బాగా జరుగుతాయని మంచి పేరుంది. అది ఏంతో మహిమగల గుడి అని అందరూ అంటారు.
ఆ గుడి పూజారి ఏంతో నియమ నిష్ఠలతో పూజ చేస్తాడు. ఒక రోజు ఆ గుడి పూజారి పూజ ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఆకాశంలోంచి పెద్ద శబ్దంతో మెరుపు మెరిసింది.
అది ఏమిటా అని పూజారి కళ్ళు నులుముకుని ఆకాశంకేసి చూశాడు. ఏంతో ధగద్ధగ్గాయమైన వెలుగులతో ఒక తొమ్మిది చదరపు గజాలు ఉండే బంగారు పళ్లెం అతని కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యింది.
అప్పుడు ఆ పూజారి శివనామస్మరణ చేస్తూ దాని దగ్గరికి వెళ్లి చూశాడు.
దానిపై ఇలా రాసి ఉంది, " ఎవరైతే నిస్వార్థ చింతనతో దాన ధర్మాలు చేస్తారో వారికే ఈ పళ్లెం చెందుతుంది. అర్హత ఉన్నవారు ముట్టుకుంటేనే ఈ పళ్ళెము బంగారు పళ్లెంగా ఉంటుంది, లేకపోతే రాయిగా మారిపోతుంది. లోకాస్సమస్తా సుఖినోభవంతు."
ఇక ఆ రోజు నుంచి పూజారి దానికి అర్హత ఉన్నవాడికోసం వెతకటం ప్రారంభించాడు.
ఈ వార్త క్షణంలో ఆ చుట్టు పక్కల ఊళ్లలో కూడా వ్యాపించింది. ఇంక ఆ బంగారు పళ్ళాన్ని పొందటానికి దూర దూరాలనుంచి జమీందారులు, దాన ధర్మాలు చేసేవారు, దురాశపరులు, ఎంతో మంది వచ్చి ఆ బంగారు పళ్ళాన్ని ముట్టుకోవటం అది రాయిగా మారితే నిరాశగా వెనుదిరగటం జరుగుతోంది.
ఇలా కొన్ని రోజులు గడిచింది. ఈ వింత ఏమిటా అని పూజారి ఆలోచించాడు. అప్పుడు అర్థమైంది పూజారికి "ఓహో! ఇది ఎక్కడో ఉండే వారికి చెందినదైతే ఇక్కడ ఎందుకు ప్రత్యక్షం అవుతుంది. అంటే ఆ నిస్వార్థ దానశీలి ఇక్కడే ఎక్కడో ఉంది ఉంటాడు" అని అనుకున్నాడు.
సరే ఇంక ఆ నిస్వార్థ దానశీలిని వెతికే బాధ్యత తానే స్వయంగా తలకెత్తుకున్నాడు.
ఉజ్జయినీలోనే ప్రతాపుడనే ఒక శ్రామికుడున్నాడు. అతను శ్రామికుడే ఐనా తనకు ఉన్న దానిలోనే ఇతరులకి సాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఒక రోజు అతను గుడి దగ్గర ఉన్న బీద బిక్కితో మాట్లాడుతుంటే పూజారి చూసి అతనితో "ఎవరు నాయనా నువ్వు? నువ్వు క్రమం తప్పకుండ ప్రతి వారం ఇక్కడ బీద బిక్కీకి సాయం చేయటం చూస్తున్నాను." అని అడుగుతాడు.
అప్పుడు ప్రతాపుడు "నేను ఒక శ్రామికుడని, నాకు ఉన్నదానిలోనే నాకన్నా లేనివారికి ఏంతో కొంత సాయం చేస్తుంటాను." అని చెప్తాడు.
ఇంక పూజారికి అర్థమయ్యింది ఈ ప్రతాపుడే ఆ నిస్వార్థ దానశీలి అని. అప్పుడు ప్రతాపుడితో పూజారి బంగారు పళ్లెం విషయం అంతా చెప్పి వచ్చి దానిని ముట్టుకోమంటాడు.
అప్పుడు ప్రతాపుడు ఏంతో వినయంగా "అయ్యా!! నేను అంతటి గొప్పదానికి అర్హుడనని మీరు అనుకుంటే ధన్యవాదాలు. కానీ నేను దానిని ఆశించట్లేదు. మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి వచ్చి ప్రయత్నిస్తాను." అని అంటాడు.
వెంటనే పూజారి ప్రతాపుడిని ఆ బంగారు పళ్లెం దగ్గరికి తీసుకెడతాడు.
ఇంకేముంది అందరూ చూస్తుండగానే ప్రతాపుడు ఆ పళ్ళాన్ని తన చేతులలోకి తీసుకోవటం ఆ బంగారు పళ్లెం బంగారంగానే ఉండటం జరిగిపొయినింది.
ఇంక పూజారి తనకు ఆ ఈశ్వరుడిచ్చిన బాధ్యతను సక్రమంగా పూర్తిచేసినందుకు, ఆ బంగారు పళ్లెం నిజమైన నిస్వార్థ దానశీలికి చెందటంతో ఏంతో ఆనందపడ్డాడు.
ప్రతాపుడు ఆ బంగారు పళ్ళాన్ని చక్కగా విధి విధానాలతో పూజిస్తూ దాని ద్వారా వచ్చిన సిరి సంపదల్ని చక్కగా దాన ధర్మాలు చేస్తూ గొప్ప దానశీలిగా పేరుతెచ్చుకున్నాడు.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
No comments:
Post a Comment